ఇప్పటి వరకు నాగ చైతన్య – సమంతలు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ బరిలోకి వచ్చిన రోజులు లేవు..కానీ గత వారం మాత్రం ఈ ఇద్దరు నటించిన వేరు వేరు చిత్రాలు ఒకేరోజు విడుదలై అందరికి షాక్ కలిగించాయి. నాగచైతన్య సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’తో పాటు సమంత చిత్రం ‘యూటర్న్’ వినాయకచవితి రోజున విడుదలయ్యాయి. వీటిలో చైతూ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు వచ్చాయి.
సమంత నటించిన సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. కానీ సోమవారం లెక్కలు మారాయి. సామ్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం తో ప్రేక్షకులు ఈ చిత్రానికే మొగ్గు చూపిస్తున్నారు. ఓవర్సీస్ లో చైతూ సినిమా ఫుల్ జోష్ తో మొదలై.. ఆ తర్వాత వీక్ అయిపోగా.. సమంత సినిమా విషయంలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ఆ చిత్ర ప్రిమియర్లకు కనీస స్పందన లేదు.
బుధవారం ప్రిమియర్లతో ‘యూటర్న్’కు కేవలం 10 వేల డాలర్లే వచ్చాయి. కానీ అదే రోజు ‘శైలజారెడ్డి అల్లుడు లక్ష డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కానీ తర్వాతి రోజు నుంచి యూటర్న్ తన జోరును పెంచింది. ‘శైలజారెడ్డి అల్లుడు’ కలెక్షన్లు తగ్గుతూ రాగా యూ టర్న్ కు మాత్రం పెరుగుతూ వచ్చాయి. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల్లో ‘యూటర్న్’ మూవీ 28 వేలు, 48 వేలు, 82 వేలు, 43 వేల డాలర్లు వసూలు చేయడం విశేషం. శని, ఆదివారాల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’కు ‘యూటర్న్’తో పోలిస్తే తక్కువ వసూళ్లు రావడం జరిగినట్లు సమాచారం.
ప్రీమియర్లతో లక్ష డాలర్లను తెచ్చిన శైలజారెడ్డి అల్లుడు సినిమా ఆతర్వాత రెండు రోజుల్లో కలిపి లక్ష డాలర్లే వసూలు చేసింది. ‘యూటర్న్’ 1.25 లక్షల డాలర్లు తెచ్చుకుంది. ఈ చిత్ర మొత్తం వసూళ్లు 2.2 లక్షల డాలర్లు దాటాయి. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్ ఆల్రెడీ లాభాల బాట పట్టాడు. ఫుల్ రన్లో ఈ చిత్రం 3 లక్షల డాలర్లకు పైనే వసూలు చేసేలా కనిపిస్తోంది. ఇక ‘శైలజారెడ్డి అల్లుడు’ మాత్రం బ్రేక్ ఈవెన్కు రావాలంటే ఇంకా చాలా దూరం రన్ అవ్వాల్సి ఉంది. మరి పూర్తి రన్ లోనైనా లాభాలు వస్తాయా అంటే కష్టంగానే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం చైతు మీద సామ్ పైచేయి సాధించింది.