జైల్లో గోలగోల చేస్తున్న సంజన

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న నటి సంజన గల్రానీకి ఇంటి ఆహారాన్ని అందించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. మరో నటి రాగిణి ద్వివేదితో కలిసి ఒకే బ్యారక్‌లో ఉంటున్న సంజనను కలిసి ఆహారం, దుస్తులు అందించేందుకు ఆమె తల్లిదండ్రులు మనోహర్, రేష్మా గల్రానీలు నిన్న జైలు వద్దకు వెళ్లారు. వారి నుంచి దుస్తులను మాత్రమే తీసుకున్న అధికారులు వెంట తెచ్చిన ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను తీసుకునేందుకు నిరాకరించి తిరిగి వారికే ఇచ్చేశారు.

మరోవైపు, నటి రాగిణి గత నాలుగు రోజులుగా జైలులో ఒంటరిగా ఉండగా, సంజన వచ్చిన తర్వాత ఆమెను కూడా అదే బ్యారక్‌లో ఉంచారు. వెంట తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ ఇద్దరూ కాలక్షేపం చేస్తున్నారు.   కాగా, తన బ్యారక్‌లో దోమలు విపరీతంగా ఉన్నాయని, వాటి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదంటూ సంజన జైలు అధికారులతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది.