నాటకం రైట్స్ దక్కించుకున్న సమంత నిర్మాతలు


ఇటీవల కాలం లో పెద్ద చిత్రాల కన్నా చిన్న చిత్రాలే పెద్ద విజయాలు సాధిస్తూ నిర్మాతలకు డిస్ట్రబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఉదాహరణకు ఆర్ ఎక్స్ 100 నే తీసుకోండి..ఎలాంటి అంచనాలు లేకుండా అంత కొత్తవారితో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో అగ్ర నిర్మాతలు సైతం చిన్న చిత్రాల వైపే మొగ్గు చూపిస్తున్నారు.

ఇటీవల సమంత నటించిన యూ టర్న్ చిత్రాన్ని సీడెడ్ మినహా, ఆంధ్ర, నైజాంలకు తీసుకుని, రీ డిస్ట్రిబ్యూట్ చేసి, లాభం చేసుకున్న బయ్యర్ లు సురేష్ రెడ్డి అండ్ కో ఇప్పుడు మరో చిన్నసినిమాను టేకోవర్ చేసినట్లు తెలుస్తుంది. నాటకం అనే సినిమాను కోటిన్నరకు ఆంధ్ర, సీడెడ్ , నైజాంల హక్కులను తీసుకున్నారు. సినిమా చూసిన వీరు సినిమా బాగా నచ్చడం తో మూడు ఏరియాల రైట్స్ ను సొంతం చేసుకున్నారట.

ఇప్పుడు ఈ సినిమాకు రెండుకోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏరియాల వారీ అమ్మేయడం ప్రారంభమైపోయింది. ఆశిష్ గాంధీ,ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్ అంజి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు.