జనసేన పార్టీ ‘కవాతు’ పాటకు ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన సంగతి తెలిసిందే. ‘పద పద పద పద మెరుపులా పద.. ఆ గగనం భువనం అదిరే మెరుపులా పద..’ అని సాగే ఈ పాటకు తమన్ బాణీలు అందించారు. ఈ నేపథ్యంలో రామజోగయ్య శాస్త్రికి, తమన్ కి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
‘విపరీతమైన పని ఒత్తడిలో ఉండి కూడా.. నా కోరికను మన్నించినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీ విలువైన సమయాన్ని కేటాయించారు. యువతని ఆలోచింప చేసే పదాలు.. భావితరాల భవిష్యత్తు కోసం పరికితనం వదిలి మనం మనోధైర్యంతో నడుం బిగించి ముందుకు నడవాలన్న మీ ఆలోచన స్ఫూర్తి చాలా ప్రస్ఫూటంగా పాట రచనలో కనిపించింది. మీకు మనస్ఫూర్తిగా జనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని పవన్ ఆదివారం ట్విటర్లో పేర్కొన్నారు. అంతేకాదు ‘ఎంతో బాధ్యత తీసుకుని అద్భుతమైన సంగీతం ఇచ్చిన ప్రియమైన తమన్కు సెల్యూట్’ అని రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్