గోపీచంద్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని దర్శకుడు సంపత్ నంది క్లారిటీ ఇచ్చారు. ఇటీవల షూటింగ్లో గోపీచంద్ గాయపడ్డ సంగతి తెలిసిందే. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జైపూర్ సమీపంలోని మాండవలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా గోపీచంద్పై బైక్ ఛేజింగ్ సీన్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బైక్ పై నుంచి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.
దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదని సంపత్ నంది చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న నా హీరో గోపీచంద్ను కలిశా. ఆ దేవుడి దయ వల్ల, అభిమానుల ఆశీర్వాదాల వల్ల ఆయన బాగానే ఉన్నారు. అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన కోసం ప్రార్థించండి. త్వరగా కోలుకోవాలని కోరుకోండి’ అని సంపత్ నంది ట్వీట్ చేశారు.