శ్రీనివాస్ రెడ్డి పేరుతో మోసాలు..

ఇటీవల కాలం లో సోషల్ మీడియా వాడకం ఏ రేంజి లో పెరిగిందో తెలియంది కాదు..ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ , ఫ్రీ డేటా ఉండడం తో ప్రతి ఒక్కరు 24 గంటలు సోషల్ మీడియా తోనే గడుపుతున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియా ను చెడు పనులకు వాడుకుంటున్నారు.

న‌కిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి అమాయ‌కుల‌కి గాలం వేసి మోసం చేయడం చేస్తున్నారు. తాజాగా ర‌వికిర‌ణ్‌ అనే వ్య‌క్తి గ‌తంలో ఆర్టిస్ట్‌ల‌ కింద అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. ఆ ప‌రిచ‌యాల‌ని అడ్డుపెట్టుకున్న ఆ వ్యక్తి న‌కిలి ఫేస్ బుక్ ఐడీల‌ని క్రియేట్ చేసి సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాను, మంచి క‌థ‌లు ఉంటే పంపాల‌ని ప‌లువురితో చాటింగ్ చేస్తూ వారి దగ్గరి నుండి డబ్బు లాగుతున్నాడు.

ఈ నేపథ్యం లో క‌మెడీయ‌న్ శ్రీనివాస‌రెడ్డి పేరుతో ఓ న‌కిలి ఐడీ క్రియేట్ చేసిన ర‌వికిర‌ణ్ ప‌లువురు నెటిజ‌న్స్‌తో చాటింగ్ చేసి, వారిని మోసం చేశాడ‌ట‌. ఈవిష‌యం శ్రీనివాస రెడ్డి వరకు వెళ్లడం తో ఆయ‌న వెంట‌నే త‌న‌కి చెడ్డ పేరు తెచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని సైబరాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసుల‌ని సంప్ర‌దించి స‌ద‌రు వ్య‌క్తిపై ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీక‌రించిన వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఇంకోసారి ఇలాంటి నేరాల‌కి పాల్పొడ‌ద్ద‌ని హెచ్చరించారు. కేవలం రవికిరణ్ మాత్రమే కాదు చాలామంది ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.