వినయ విధేయ రామ టీజర్ టాక్ – ‘మెగా అరుపులే’

మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లోని వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బోయపాటి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేసి అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్ తాజాగా శుక్రవారం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

‘అన్నయ్యా..వీడిని చంపేయాలా? భయపెట్టాలా?’ భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పావుగంట.. ఏదైనా ఓకే. సెలెక్ట్‌ చేస్కో’ అంటూ రామ్‌ చరణ్‌ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ చెప్తున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. టీజర్‌లో సీనియర్ నటుడు ప్రశాంత్‌ను ఎవరో బెదిరిస్తుంటే.. అతన్ని కాపాడేందుకు చరణ్‌ వెళ్తాడు. అప్పుడు చరణ్‌..‘రేయ్‌.. పందెం పరశురాం అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్‌..రామ్‌..రామ్‌ కొణిదెల’ అని బల్ల గుద్ది చెప్తున్న డైలాగ్‌ మెగా అభిమానుల్లో రోమాలు నిక్క పొడుచుకునేలా చేసింది.

ఈ టీజర్ చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవడానికి..బోయపాటి యాక్షన్ కు మెగా పవర్ స్టార్ తోడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షమే అని ఈ సినిమాతో రుజువు కాబోతుందన్నట్లు టీజర్ కట్ చేసారు. ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ఈ టీజర్ కనువిందు చేసింది.

రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డి.వీ.వీ.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌‌లో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రానుంది.