పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి


జమ్ముకశ్మీర్‌లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మంది భారత జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనని మరువక ముందే పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పింగ్లన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ మేజర్‌ సహా నలుగురు జవాన్లు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి.

ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీస్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇది కూడా జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల పనేనని తెలిసింది.