గుడి బాట పట్టిన నేతలు..

మొన్నటి వరకు ప్రజా బాట పట్టిన నేతలంతా..ఇప్పుడు గుడి బాట పట్టారు. ఎలాగైనా ఎన్నికల్లో విజయం వరించేలా చూడమంటూ దేవుళ్లను వేడుకుంటారు. కేవలం నేతలు మాత్రమే కాదు కార్య కర్తలు సైతం తమ అభ్యర్థి ఎన్నికల్లో గెలువాలంటూ ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలంటూ పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరస్వామి ఆలయంలో ఆగ్రోస్‌ చైర్మన్‌ లింగంపెల్లి కిషన్‌రావు దంపతులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. కిషన్‌రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మధ్యప్రదేశ్ తోపాటు రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ల వంటి రాష్ట్రాలలో కూడా నేతలు గుడి బాట పట్టారు. రాజకీయ నేతలకు అత్యంత ఇష్టమైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం సైతం పూజలు చేసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభ్యర్థులతో సందడిగా కనిపిస్తోంది. గతంలో టికెట్ల కోసం పూజలు చేసిన నేతలు ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపు కోసం పండితులతో మంత్రోచ్ఛారణలు చేయిస్తున్నారు. హోమాలు , పెద్ద పెద్ద పూజలు చేస్తూ దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరి వీరి పూజలు ఎంత ఫలిస్తాయో చూడాలి.