ఉప్పల్ స్టేడియం లో రచ్చ రచ్చ చేసిన యాంకర్..కేసు నమోదు

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్-కోల్‌కతా మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లి.. ఓ గ్యాంగ్ నానా హంగామా చేయడం అందరిని ఇబ్బంది పెట్టింది. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తూ పక్క సీట్లలో కూర్చున్నవారిని ఇబ్బంది కలిగించారని ఆరోపిస్తూ భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శాంటోష్ ఉపాధ్యాయ్, ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ బాక్స్ 22 నుంచి మ్యాచ్ చూడకుండా వికృత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ్‌ ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువతులతో సహా నగరంలోని ఆరుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చారు.

ఐపీసీ సెక్షన్ 341, 188, 506ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో మాదాపూర్‌కి చెందిన టీవీ యాంకర్ చింతల ప్రశాంతి, అమీర్‌పేట్‌కి చెందిన కందుకూరి ప్రియ, కందుకూరి పూర్ణిమ, నాగోల్‌కి చెందిన గుర్రం వేణు, దిల్‌సుఖ్‌నగర్‌కి చెందిన శ్రీకాంత్ రెడ్డి, మాదాపూర్‌కి చెందిన లక్కపల్లి సురేశ్ ఉన్నారు.