ఐరాసలో భారత్ కు అరుదైన గౌరవం


ఇప్పుడు మన భారత్ కు అరుదైన గౌరవం దక్కింది. అదీ ఎక్కడంటారా ఐక్య రాజ్య సమితిలోని అత్యున్నత మావన హక్కుల మండలి విభాగమైన యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి భారతదేశం ఎన్నికైంది.

యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోసం 193 మంది సభ్యులు కలిగిన యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది. మానవ హక్కుల మండలిలో 18 మంది కొత్త సభ్యుల కోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఒక్కొక్క దేశానికి కనీసం 97 ఓట్లు వస్తేనే మండలిలో చోటు దక్కుతుంది.

యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ కు అత్యధికంగా 188 ఓట్లు పోలయ్యాయి. 2019 జనవరి 1వ తేదీ నుంచి మూడేళ్లపాటు భారత్‌ ఈ పదవిలో కొనసాగుతుంది. ఆసియా పసిఫిక్ కేటగిరీలో భారత్.. బెహ్రాయిన్, బంగ్లాదేశ్, ఫిజీ, పిలిప్పీన్స్‌తో పోటీపడింది.

ఐక్యరాజ్య సమితి రాయబారి, భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ… భారతదేశం యొక్క విజయం అంతర్జాతీయ సమాజంలో దేశం యొక్క స్థానాన్ని ప్రతిబింబిస్తుందని పిటిఐకి చెప్పారు. మద్దతు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు.