న్యూజిలాండ్‌ లో నరమేధం..

దుండగులు జరిపిన కాల్పులతో న్యూజిలాండ్‌ నగరం వణికిపోయింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని రెండు మసీదుల్లో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళతో పాటు ముగ్గురి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్‌ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయానికి మసీదులో దాదాపు 300 మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. మసీదులో చాలా మృతదేహాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. దాడి సమయంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా మసీదులోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడ్డారు.