జగన్ ఫై చిరంజీవి మెగా ప్రశంసలు..

మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న చరిత్రాత్మక బిల్లుఫై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా ముసాయిదా బిల్లును తీసుకరావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి జగన్ ఫై ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. దిశ సంఘటన మన అందర్నీ కలిచివేసింది, ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయం’అన్నారు.

‘సీఆర్పీసీ(CRPC) ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ(IPC) ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది’ అన్నారు చిరంజీవి.