జగన్ గెలిచాడు ..అతడు బయటకొచ్చాడు..

నూతన రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీ తో వైస్సార్సీపీ విజయకేతనం ఎగరవేయడంతో వైసీపీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఫై దాడి చేసిన శ్రీనివాస్ బయటకు రావడం మరింత ఆశ్చర్యం వేస్తుంది.

గతేడాది విశాఖ విమానాశ్రయంలో జగన్ ఫై కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాస్ రాజమహేంద్రవరం జైలు లో ఉన్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి విజయవాడలోని న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. తన క్లయింట్‌ మలేరియా, డెంగీ, అజీర్ణంతో బాధపడుతున్నాడని శ్రీనివాస్ న్యాయవాది కోర్టుకు తెలుపడం తో వాదనలు విన్న జడ్జి పార్ధసారథి రూ.60వేలు, ఇద్దరి పూచీకత్తుపై శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేశారు. జగన్‌ సీఎం కావడానికి సానుభూతి కోసమే దాడికి పాల్పడ్డానని శ్రీనివాస్ చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి శ్రీనివాస్ కోరుకున్నట్లుగానే జగన్ సీఎం కావడం, శ్రీనివాస్ బయటకు రావడం జరిగిపోయింది.