టీడీపీ నుండి ఎన్టీఆర్ ను దూరం చేసింది వారే అంటున్న బెజవాడ మాజీ ఎమ్మెల్యే

ప్రస్తుతం ఏపీలో వంశీ..వార్ నడుస్తూనే ఉంది. గన్నవరం ఎమ్మెల్యే వంశీ తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ,లోకేష్ ఫై కామెంట్స్ చేయడం టీడీపీ నేతల్లో ఆగ్రహం తెప్పించాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం రావాలంటే పార్టీ పగ్గాలు జూ. ఎన్టీఆర్ పట్టాలిసిందే అని అన్నారు. దీంతో ఎవరో ఒకరు ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ వార్తల్లో ఎన్టీఆర్ హైలైట్ అయ్యేలా చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు వాడుకుని వదిలేశారని వంశీ చేసిన వ్యాఖ్యలపై బోండా ఉమ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని అత్యంత ఎక్కువగా వాడుకున్నది కొడాలి నాని, వల్లభనేని వంశీయేనని.. తెలుగుదేశం , చంద్రబాబు కాదన్నారు. అయినా తెలుగుదేశం మా తాత పెట్టిన పార్టీ. నన్నెవరూ ఈ పార్టీలో ఉండమని చెప్పక్కర్లేదు. అది నాబాధ్యత అని జూనియర్ ఎన్టీఆరే చెప్పారని బోండా గుర్తు చేశారు.

సినిమా ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టే రాజకీయాలకు దూరంగా ఉన్నారని బోండా ఉమ అభిప్రాయపడ్డారు. కొడాలి నాని, వంశీ.. వాళ్ల సీట్ల కోసం ఎన్టీఆర్‌ను ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఇప్పుడు అదే విషయాన్ని పార్టీ మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. మొత్తం మీద వంశీ వార్ మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.