తిత్లీ బాధితులకు విజయ్ దేవరకొండ సాయం..

ఇటీవల వచ్చిన తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాలో భారీ ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్తులు ఎప్పుడు జరిగిన మీము ఉన్నామంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు ముందుకొస్తుంటారు. ఇటీవలే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన వంతుగా సాయంగా రూ. 50 వేల సాయాన్ని ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇప్పుడు‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ సైతం తనవంతు సాయాన్ని అందజేసి వార్తల్లో నిలిచాడు.

తన వంతుగా సిక్కోలుకు రూ. 5లక్షలు ఆర్థిక సాయం చేశారు. సీఎం రిలీప్ ఫండ్‌కు డబ్బులు పంపినట్లు స్క్రీన్ షాట్‌ను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ‘లేహ్‌లో ఉన్న నాకు ఇప్పుడే తిత్లీ తుఫాన్ విషయం తెలిసింది. ప్రస్తుతం మన సొంత ప్రాంతంలో సమస్య వచ్చింది. పెద్ద మనసుతో ఎంత ఇచ్చినా పెద్ద సాయం అవుతుంది. గతంలో కేరళకు సాయం చేశారు. ఇప్పుడు మనవాళ్లకు సాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని’ విజయ్ పోస్ట్ చేసాడు.

ఇటీవలే విజయ్ నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ , టాక్సీ వాలా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.