ఏపీలో మళ్లీ ఎన్నికలు..ఈసారి దేనికి అంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతుండగానే ..ఎన్నికల గంటా మోగింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఈసీ. మోపిదేవి వెంకటరమణారావు  రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఆగస్ట్‌ 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది.

అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక అయ్యారు. దీంతో ఇద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా.. ఆమోదం తెలిపారు. ఇటీవల వారిద్దరు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి మొత్తం నలుగురు రాజ్యసభకు వెళ్లారు.. మోపిదేవి, పిల్లి చంద్రబోస్‌లతో పాటూ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు ఉన్నారు.