జనసేనలోకి చదలవాడ ?

టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి జనసేనలోకి చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌తో చదలవాడ సుదీర్ఘ సమావేశం నేపథ్యంలో ఈ ఊహాగానాలు రేగాయి. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేది చదలవాడ కోరికగా తెలుస్తోంది.

అక్టోబర్‌లో విజయదశమి రోజున అధికారికంగా జనసేనలో చేరనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకపోవడంతోపాటు ఇటీవల బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు సరైన గౌరవం ఇవ్వనందునే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యానని అనుచరుల వద్ద కృష్ణమూర్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక.. 2015 ఏప్రిల్‌లో ఆయణ్ను తిరుమల, తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమించింది. అయితే తాజా మారిన పరిస్థితులు దృష్ట్యా ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.