దుబ్బాక ఎమ్మెల్యే మృతి..

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. ఆయన మరణ వార్త జిల్లా, నియోజకవర్గ ప్రజలను షాక్ కు గురి చేసింది. రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. ఆయన మృతిపట్ల టీఆర్‌ఎస్‌ నేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.

రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. రామలింగారెడ్డి 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో మాత్రం ఓటమి ఎదురైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 సార్వత్రిక ఎన్నికలలోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.