విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురి మృతి

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని రమేష్‌ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ భవనంలో 40 మంది వరకు ఉండగా.. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధితులను రమేశ్ హాస్పిటల్, ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తరలించారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కింది అంతస్థులో మంటలు చెలరేగి భవనం పైభాగానికి విస్తృతంగా వ్యాపించాయి. మంటలకు భయపడి ఒకటో అంతస్థు నుంచి నలుగురు కిందికి దూకినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో కృష్ణయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు సీపీ తెలిపారు.