కెసిఆర్ ముక్కు కోస్తాం

మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యకుంటే ఆసరా పింఛన్లు కట్‌ చేస్తామంటూ చేస్తున్న అబద్ధపు ప్రచారం ఆపకపోతే సీఎం కేసీఆర్‌ ముక్కు కోయడం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మునిసిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయన అంతకుముందు నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆసరా పింఛన్లలో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుంటే, కొంత రాష్ట్ర సర్కారు చెల్లిస్తుందని గుర్తు చేశారు.

ఎన్నికల సందర్భంగా ఆసరాఫై అబద్ధపు ప్రచారం చేస్తూ ఓట్లు దండుకోవడానికి గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై సంశయం అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చారు. మునిసిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కమలం జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మంత్రి కేటీఆర్‌ రాజకీయ సన్యాసి అని, అందుకే మోదీ, అమిత్‌షాను విమర్శిస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్‌ను కేటీఆర్‌, కవిత కలిసి చరిత్ర హీనుడ్ని చేశారని ధ్వజమెత్తారు.