కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధువారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పరమర్షిస్తున్నారు. ఈ తరుణంలో మాజీ ఎంపీ, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి తండ్రి కేపీ రెడ్డయ్య పామర్రు వద్ద పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెడ్డయ్య వివరించారు. ఇండియాలో రైతు అనేవాడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఇప్పుడు కేవలం కూలీలే ఉన్నారని, రైతులు లేరని వాపోయారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… తుఫాన్ ప్రభావం రైతులను నట్టేట ముంచిందని.. చేతికంది వచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమన్నారు. మీకు అండగా ఉండలానే మీ దగ్గరకు వచ్చానని.. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయమని తెలిపారు. ఓట్ల సమయంలోనే వచ్చి వెళ్లే వ్యక్తి ని తాను కానని.. ఇప్పుడు ఎన్నికలు లేవని గుర్తు చేశారు. ప్రజల బాధలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకే వచ్చానని పేర్కొన్నారు. కష్టించి పండించిన పంట మొత్తం దెబ్బతిందని.. సొంత భూమి రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.