తీర్పుపై సూరి భార్య రియాక్షన్

ఏడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసుపై నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.

కాగ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు ఉరి శిక్ష పడి ఉంటే బాగుండేదని సూరి సతీమణి గంగుల భానుమతి అన్నారు. నాంపల్లి కోర్టు ఈరోజు భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సూరి పక్కనే నమ్మకంగా ఉంటూ భానుకిరణ్‌ ఇలా చేస్తాడని తాము అనుకోలేదన్నారు. ఏడేళ్ల తరువాత తీర్పు వచ్చిందన్నారు. భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడిందని.. దీంతో అతడికి జీవితం విలువ ఏంటో తెలుస్తుందన్నారు అయితే, భానుకిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సూరి ఆత్మకు శాంతి చేకూరేదని అన్నారు.