స్టార్ కాస్ట్ : సాయి శ్రీనివాస్ , పూజ హగ్దే , జగపతిబాబు తదితరులు..
దర్శకత్వం : శ్రీవాస్
నిర్మాతలు: అభిషేక్ నామా
మ్యూజిక్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
విడుదల తేది : జులై 27, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5
రివ్యూ : సాక్ష్యం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రం ‘సాక్ష్యం’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ఫై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..
కథ :
స్వస్తిక్ పురం గ్రామంలో మును స్వామి (జగపతి బాబు) అతని తమ్ములు నిత్యం ప్రజలను ఇబ్బంది పెడుతూ, వారిని హింసిస్తుంటారు. ఇది చూసిన రాజుగారు (శరత్ కుమార్) వారిని అడ్డుకుంటాడు. దీంతో పగ పెంచుకున్న మును స్వామి, అతని తమ్ములు రాజుగారి కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు. అంతే కాదు ఈ ఘాతుకానికి సాక్ష్యం ఎవరూ ఉండకూడదని పిల్లలు, పశువులను కూడా వదలకుండా చంపేస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును ఓ లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అలా చావు నుంచి తప్పించుకున్న పిల్లాడిని ఓ వ్యక్తి తీసుకెళ్లి కాశీలో వదిలేస్తాడు.
కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్రకాశ్(జయప్రకాశ్) చెంతకు చేరుతాడు. పిల్లలు లేని శివ ప్రకాశ్ ఆ పిల్లాడికి విశ్వజ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు. అక్కకు తోడుకు ఉండేందుకు అమెరికా వచ్చిన సౌందర్య లహరి(పూజ హెగ్డే) ప్రవచనాలు చెపుతుండగా చూసి తొలి చూపులోనే విశ్వజ్ఞ ప్రేమలో పడతాడు. ఇండియన్ ట్రెడిషన్ పై తాను చేసే ఓ వీడియో గేమ్ కు సాయం చేయమని సౌందర్యను అడుగుతాడు. సౌందర్య.. వాల్మీకి (అనంత శ్రీరామ్) అనే వ్యక్తిని విశ్వకు పరిచయం చేస్తుంది. వాల్మీకి పంచభూతాల నేపథ్యంలో ఓ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్ చెప్తాడు. ఈ లోపు సౌందర్య ఇండియాకు వచ్చేస్తుంది. విశ్వ కూడా సౌందర్య కోసం ఇండియా వచ్చేస్తాడు. ఆలా ఇండియాకు వచ్చిన విశ్వజ్ఞ.. సౌందర్య ను తన ప్రేమలోకి ఎలా దింపుతాడు..? మునస్వామి తో పాటు అతడి తమ్ముళ్లను ఎలా చంపాడు…? విశ్వజ్ఞ కు ప్రకృతి ఎలా సహాయపడింది..? సౌందర్య లహరి కి, మునస్వామి కి సంబంధం ఏంటి..? అసలు ప్రకృతి కి ఈ కథకు సంబంధం ఏంటి అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.
ప్లస్ :
* పంచభూతాల కాన్సెప్ట్
* రీ రికార్డింగ్
* బెల్లం కొండ శ్రీనివాస్ యాక్టింగ్
* విజువల్స్
* పీటర్ హెయిన్స్ ఫైట్స్
మైనస్ :
* అక్కడక్కడా కన్ఫ్యూజన్
* ఫస్ట్ హాఫ్
నటీనటుల పెర్పామెన్స్ :
* ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ కథలతో అలరించాడు..కానీ ఈ చిత్రం లో మాత్రం కొత్త కాన్సప్ట్ తో వచ్చి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మంరితగా ఆకట్టుకున్నాడు. యాక్షన్, డ్యాన్స్ లు అదరగొట్టాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాకు తనవంతుగా పూర్తి న్యాయం చేశాడు.
* పూజా హెగ్డే పాటల్లో ఒకలా, సన్నివేశాల్లో మరోలా కనిపించింది. మరీ బక్క చిక్కినట్లు కనిపించడం అభిమానులకు నిరాశ కలిగించింది.
* విలన్ గా జగపతి బాబు మరోసారి తన మార్క్ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మంచి విలనిజం పండించారు. కాకపోతే ఇంకాస్త ఈయన నుండి విలనిజం బయటకు తీస్తే బాగుండు అనిపిస్తుంది.
* జగపతి బాబు తమ్ముళ్లుగా నటించిన అశుతోష్ రానా, రవికిషన్లు కూడా తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
* ఇతర పాత్రల్లో జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, రావూ రమేష్, వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కాకపోతే సినిమా అంత ఎక్కువగా హీరో, పంచ భూతాల చుట్టూ సాగడంతో మిగతా పాత్రలు ప్రేక్షకులకు అంతగా గుర్తుండవు.
సాంకేతిక విభాగం :
* ఈ చిత్రానికి మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వరన్ అనే నూతన సంగీత దర్శకుడు అందించాడు. రెండు, మూడు పాటలు బాగున్నప్పటికీ, రీ రికార్డింగ్ బాగా ఆకట్టుకుంది. ఇలాంటి కథకు ఎలాంటి రీ రికార్డింగ్ ఇవ్వాలో అలాంటిది ఇచ్చి సక్సెస్ సాధించాడు.
* పీటర్ హెయిన్ ఫైట్స్ సినిమా హైలైట్స్ లలో ఒకటిగా నిలిచాయి. శ్రీనివాస్ సాయి సైతం చాల రిస్కీగా చేసి ఆకట్టుకున్నాడు. మాస్ ఆడియన్స్ కు ఈ ఫైట్స్ బాగా నచ్చుతాయి.
* సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా పర్వాలేదు అనిపించాయి.
* ఫస్ట్ హాఫ్ లో కాస్త ఎడిటింగ్ ఇబ్బంది పెట్టింది.
* ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
* ‘బాహుబలి’ చిత్రానికి సిజి వర్క్ చేసిన టీం ఈ చిత్రానికి వర్క్ చేసి తమ సత్తా చాటారు.
* ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే అభిషేక్ నామా దాదాపు ఈ చిత్రం కోసం రూ.40 కోట్లు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆయన పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. సినిమా చాలా రిచ్గా ఉంది.
* ఇక డైరెక్టర్ శ్రీవాస్ దగ్గరకు వస్తే..పగ, ప్రతీకారం, హీరో ఫ్యామిలీని విలన్లు చంపడం, విలన్లను చంపేందుకు హీరో రావడం, చివరకు విలన్లు చంపి తన ప్రతీకారం తీర్చుకోవడం వంటి కథలు ఇప్పటికే చాల వచ్చాయి. ఈ కథ కూడా అలాంటిదే కాకపోతే దానికి డైరెక్టర్ పంచభూతాలు అనే నేపథ్యాన్ని వాడుకొని ప్రేక్షకుడికి కొత్తదనం అందించాడు.
గాలి, నిప్పు, నేల, మట్టి, ఆకాశం.. ఈ పంచభూతాలు మనిషిని సృష్టిస్తాయి, నాశనం చేస్తాయి. ప్రకృతి ధర్మాన్ని మనం పాటిస్తే మన ఉన్నతికి తోడ్పడుతాయి. వాటిని అతిక్రమిస్తే అంతం చేస్తాయి అనేది చూపించాడు. కాకపోతే ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో చూడాలి.
చివరిగా :
కేవలం మనుషులే కాదు పంచభూతాలు సైతం ప్రతీకారం తీర్చుకుంటాయి..అవి ఎలా తీర్చుకుంటాయి అనేది ఈ కథ. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ గా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. సాయి శ్రీనివాస్ యాక్షన్, డాన్స్ బాగా నచ్చుతాయి.. అలాగే చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. తెలిసిన కథే అనిపించినా కొత్తగా చూపించేసరికి ప్రేక్షకులకు నచ్చవచ్చు.