ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. చివరి రోజైన సోమవారం మరో ఆరు వికెట్లు తీస్తే టీమిండియాను విజయం వరించనుంది. నాలుగో రోజు 153/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటై, ఆసీస్కు 323 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. రహానె, పుజారా అర్ధ శతకాలతో రాణించారు. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 104/4తో నిలించింది.
ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్(11)ను భారత స్పిన్నర్ అశ్విన్ పెవిలియన్ చేర్చగా.. మరో ఓపెనర్ హ్యారీస్(26)ను మహ్మద్ షమీ క్యాచ్ ఔట్ చేయడంతో 44 పరుగులకే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం మరోసారి చెలరేగిన అశ్విన్-షమీ ద్వయం.. ఉస్మాన్ ఖవాజా(8), హ్యాండ్స్ కోంబ్ (14)లను పెవిలియన్ చేర్చింది. క్రీజులో షాన్ మార్ష్ (31నాటౌట్), ట్రావిస్ హెడ్ (11 నాటౌట్)లున్నారు.