హిమదాస్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన టాలీవుడ్ హీరోస్..

ప్ర‌పంచ జూనియ‌ర్ వ‌ర‌ల్డ్ అథ్లెటిక్ పోటీల‌లో భారత్ కు స్వ‌ర్ణ ప‌త‌కం తీసుకొచ్చి తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది హిమ‌దాస్. అండర్-20 విభాగంలో ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన 400మీటర్ల ఫైనల్లో 51.46 సెకన్లలో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది.

ఈ నేపథ్యం లో ఈమెపై రాజకీయ , సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ., యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు సోష‌ల్ మీడియా ద్వారా హిమ‌దాస్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

కొత్త చరిత్ర సృష్టించిన హిమదాస్: ఎన్టీఆర్

‘కొత్త చ‌రిత్ర సృష్టించిన హిమ‌దాస్‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో స్వ‌ర్ణం నెగ్గిన అథ్లెట్‌గా నిలిచారు. ఇది గొప్ప సంతోష‌క‌ర స‌మ‌యం’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

చాలా గర్వంగా ఉంది: మహేష్ బాబు

‘హిమ దాస్ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది. భార‌త క్రీడారంగంలోనే అత్యంత అరుదైన విజ‌యాల్లో ఇదొక‌టి. చాలా గ‌ర్వంగా ఉంది. సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ హిమ‌దాస్‌’ అంటూ మ‌హేష్ ట్వీట్ చేశాడు.

హిమదాస్‌కు సెల్యూట్: రామ్ చరణ్

‘హిమ‌దాస్‌కు సెల్యూట్‌! మీరు దేశాన్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారు. ప్ర‌పంచ జూనియ‌ర్ చాంపియ‌న్ షిప్‌లో ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన తొలి భార‌తీయురాలు హిమ‌దాస్‌. దేశం యావ‌త్తు మీకు సెల్యూట్ చేస్తోంది’. అని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రామ్‌చ‌ర‌ణ్ పోస్ట్ చేశాడు.