ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను గెలుచుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్లోనూ బోణీ కొట్టింది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. జోస్ రాయ్(38) ఆరంభంలో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. మరోవైపు బెయిర్స్టో కూడా నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లాండ్ 10ఓవర్లకు 70పరుగులు సాధించింది.
ఈ దశలో 11ఓవర్లో బంతి అందుకున్న కుల్దీప్యాదవ్ ఆ ఓవర్లో రెండో బంతికే ఓపెనర్ రాయ్ను బోల్తా కొట్టించాడు. అనంతరం 13ఓవర్లో వెంటవెంటనే బెయిర్స్టో(38;), జో రూట్(3)లను వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఇంగ్లాండ్ పతనాన్ని ఆరంభించాడు. దీంతో 20ఓవర్లకే ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్(53 బెన్ స్టోక్స్(50) రాణించడంతో ఇంగ్లాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ అద్భుత శతకం(137), విరాట్ కోహ్లీ(75) అర్ధశతకం రాణించడంతో ఇంగ్లాండ్పై అలవోక విజయం సాధించింది.రోహిత్, కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ 40.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. రెండో వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో ఈ నెల 14న జరగనుంది.