ఈరోజు నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లి టికెట్ తీసుకోవాల్సినవసరం లేదు..

అవును…ఇప్పుడు మీ మొబైల్ నుండే మీరు ప్రయాణం చేయాల్సిన రైల్వే టికెట్ ను పొందవచ్చు. సాధారణ/అన్ రిజర్వ్‌డ్ టికెట్లను స్మార్ట్ ఫోన్ ద్వారా తీసుకునే అవకాశాన్ని దక్షిణ మధ్య రైల్వే తీసుకొచ్చింది. ఈ టికెట్స్ కోసం UTSonmobile ఆప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ యాప్ ద్వారా సిటి సబర్బన్ టికెట్లను, ఎంఎంటీఎస్ టికెట్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఈరోజు నుండి అన్ రిజర్వ్‌డ్ టికెట్లకు కూడా పొందగలిగే అవకాశం కల్పించారు.

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం మన వివరాలు నమోదు చేసుకున్న తరువాత అందులో ఉండే ఆర్ వాలెట్‌లో జీరో బ్యాలెన్స్ చూయిస్తుంది. ఆర్ వాలెట్‌ను నెట్ బ్యాకింగ్, డిబెట్ కార్డు, క్రెడిట్ కార్డు, రైల్వే బుకింగ్ కౌంటర్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. రూ.100 నుంచి రూ.5000 వరకు రిచార్జ్‌కు అనుమతి ఇస్తారు.

సాధారణ టికెట్‌ను రైల్వే ట్రాక్ నుంచి 15 మీటర్ల దూరం నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో, ప్లాట్‌ఫామ్ టికెట్‌ను రెండు కిలో మీటర్ల దూరం నుంచి తీసుకోవచ్చు. సీజన్ టికెట్ తీసుకోవచ్చు. దానిని రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందులో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మాత్రం లేదు. ఏ రోజు ప్రయాణం టికెట్ ఆరోజు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్‌ను ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైల్వే తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు మీ మొబైల్‌లో చూపిస్తే సరిపోతుంది.

ఇక టికెట్ ను ఎలా బుక్ చేసుకోవాలో చూడండి..

* యాప్ లాగిన్ కాగానే బుక్ టికెట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
* అనంతరం స్కీన్‌పై కనిపించే దానిలో నార్మల్ బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్‌కు ప్రయాణం చేయాలనుకుంటున్నావో ఎంటర్ చేయాలి.
* ఎంత మంది ప్రయాణికులు, ప్రయాణించే క్లాస్, ఏ ట్రైన్ అనే ఆప్షన్‌ను ఎంటర్ చేయాలి.
* ఆర్ వాలెట్ నుంచి డబ్బులు చెల్లించాలని అటోమెటిక్‌గా బుక్ టికెట్ ఆప్షన్ వస్తుంది.
* అది నొక్కగానే టికెట్ మీ మొబైల్ ఫోన్‌పై ఉంటుంది.
* టికెట్‌ను బుక్ చేసుకున్న మూడు గంటలలోపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.