New Bar Policy : ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త బార్ పాలసీని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కొత్త పాలసీ రూపొందించామని తెలిపారు.
“మద్యం పాలసీ అంటే కేవలం ఆదాయం కోసం కాదు, ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం,” అని సీఎం స్పష్టం చేశారు. అధిక ఆల్కాహాల్ కంటెంట్ ఉన్న మద్యం వినియోగం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని, తక్కువ ఆల్కాహాల్ కంటెంట్ ఉన్న మద్యం ప్రోత్సహించడం ద్వారా సమాజానికి నష్టం తగ్గించవచ్చని ఆయన వివరించారు.
మద్యం కారణంగా పేద కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో, బార్లలో కూడా కల్లు గీత కార్మికులకు 10 శాతం లైసెన్సులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మద్యం షాపుల్లో 10 శాతం లైసెన్సులు కల్లు గీత కార్మికులకు కేటాయించగా, ఇప్పుడు బార్ లైసెన్సులలోనూ అదే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 840 బార్లలో సుమారు 84 బార్లు కల్లు గీత కార్మికులకు కేటాయించే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ఈ చర్యలతో రాష్ట్రంలో మద్యం నియంత్రణ మరింత సమర్థవంతంగా అమలవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

