
AP Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త కూటమి ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకానికి ‘స్త్రీ శక్తి’ అనే పేరు కూడా ఖరారు చేసింది ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ‘జీరో ఫేర్ టికెట్’ పేరుతో టికెట్లు జారీ చేయనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఇచ్చే ఈ టికెట్లపై ‘స్త్రీ శక్తి’ అని ముద్రించనుంది. అంతేకాదు జీరో ఫేర్ టికెట్లపై చార్జీలు, ప్రభుత్వ రాయితీ వివరాలు కూడా స్పష్టంగా ముద్రించనున్నారు.
ఈ పథకం అమలుతో, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి అయినా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సిబ్బంది ఈ మార్పులకు సన్నద్ధంగా ఉండేందుకు ఇప్పటికే డ్రైవర్లు, కండక్టర్లు, డిపో ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇకపోతే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రతీ మహిళ గుర్తింపు కార్డులను తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటి వాటిని చూపించి ప్రయాణం చేయవచ్చు.
