Sajjala :వైఎస్సార్సీపీ ప్రచార విభాగం మరింత చురుకుగా, సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షానే నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, “ప్రచార విభాగం పార్టీకి కీలకం. ఇది ఇతర అనుబంధ విభాగాలకంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తుంది. ఈ వింగ్లో పనిచేయడం ద్వారా విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. కృషి చేస్తే గుర్తింపు, బాధ్యతలు రెండూ వస్తాయి. పబ్లిసిటీ వింగ్లో ఆకాశమే హద్దుగా పనిచేయగల సామర్థ్యం ఉంది” అని పేర్కొన్నారు.
అలాగే, పార్టీ బలోపేతం కోసం కమిటీల నియామకం సమగ్రమైన విధంగా జరగాలని సూచించారు. “ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే సమయంలో, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచి అవగాహన కల్పించాలి. చంద్రబాబు అబద్ధాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ మనం నిజాలను మాత్రమే ప్రజల ముందు ఉంచాలి. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎదిగింది. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరం ఒకే దారిలో ముందుకు సాగాలి” అని సజ్జల దిశానిర్దేశం చేశారు.

