Site icon TeluguMirchi.com

ED Notice to Mahesh Babu : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు


ED Notice to Mahesh Babu: హీరో మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆయనను ఈడీ ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి ప్రమోషన్ చేసిన మహేష్ బాబు రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇందులో కొంత నగదు రూపంలో, మరికొంత ఆర్టిజిఎస్ ద్వారా చెల్లింపులు జరిగినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇటీవల సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్‌పై ఈడీ నిర్వహించిన సోదాల సమయంలో వెలుగులోకి వచ్చాయి. దాంతో, సంబంధిత ఆధారాల ప్రకారం మహేష్ బాబుకు నోటీసులు అందించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లు పెద్ద ఎత్తున వెంచర్ ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు గతంలో సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను అరెస్టు చేశారు. అదే విధంగా సురానా గ్రూపుపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఈడీ విచారణను ప్రారంభించగా, ఈ నెల 16వ తేదీన రెండు రోజులపాటు ఈ రెండు సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో గుర్తించిన ఆధారాలపై చర్యల్లో భాగంగానే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Exit mobile version