
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా మూవీ “పెద్ది”. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో కనులపండువగా జరిగింది. ఈ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. స్టేజ్పై ఆమె అచ్చ తెలుగులో ప్రసంగిస్తూ, శ్రీదేవి ఐకానిక్ డైలాగ్ను రీ-క్రియేట్ చేసిన తీరుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పాటు మెగా ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు.
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడుతూ.. అభిమానుల్లో జోష్ నింపారు. “మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు కూడా మీరు ఇదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమే మేము రాత్రి పగలు కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది.. మీ జీవితానికి అర్థం ఏంటి? మీ ఐడెంటిటీ ఏంటి? అనేది కనుక్కోవడమే ఈ చిత్రం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. ఐ హోప్.. నేను మిమ్మల్ని ప్రౌడ్గా ఫీలయ్యేలా చేస్తాను” అని అన్నారు.
సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి జాన్వీ చెప్తూ.. “ఈ సినిమా రిలీజ్కు ముందే నాకు చాలా వండర్ఫుల్ జ్ఞాపకాలను ఇచ్చింది. రామ్ చరణ్ సార్తో వర్క్ చేసే అవకాశం ఇచ్చింది. హి ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ జెమ్ ఆఫ్ ఎ పర్ఫామర్. జై చరణ్! ఇక బుచ్చిబాబు సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. ఆయన చాలా సాదాసీదాగా, సింపుల్గా కనిపిస్తారు కానీ ఆయనో రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ..). ప్రతి టేక్ తర్వాత ఆయన నన్ను ఇమిటేట్ చేస్తారు. ‘అదిరిపోయింది మా.. అదిరిపోయింది.. కానీ మళ్ళీ ఒకసారి టేక్’ అంటారు. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో టేక్ అడుగుతారన్నమాట” అని పేర్కొన్నారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవిల ఆల్టైమ్ క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని ఇంద్రజ (అతిలోకసుందరి) ఐకానిక్ డైలాగ్ను స్టేజ్ పైన జాన్వీ కపూర్ రీ-క్రియేట్ చేశారు. స్క్రీన్ పై విజువల్స్ చూసిన అనంతరం జాన్వీ మైక్ అందుకుని.. “మానవా.. ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా..” అంటూ శ్రీదేవి స్టైల్లోనే ఆ డైలాగ్ చెప్పి విజయవాడను షేక్ చేశారు. జాన్వీ నోట ఆ డైలాగ్ వినగానే పక్కనే ఉన్న రామ్ చరణ్ పూర్తిగా ఫిదా అయిపోయి చప్పట్లతో అభినందించారు. మెగా ఫ్యాన్స్ కేరింతలతో బెంజ్ సర్కిల్ పరిసరాలు మారుమోగాయి.

