
Mirai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రం ఈ గురువారం(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా, తేజ సజ్జా హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.150 కోట్ల దిశగా దూసుకుపోతున్న ‘మిరాయ్’ బృందం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ తమ సినిమా హౌస్ఫుల్ షోలు కొనసాగుతున్నప్పటికీ, పవన్ కళ్యాణ్కి గౌరవ సూచకంగా గురువారం రోజున ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లను ‘ఓజీ’ కోసం కేటాయిస్తున్నట్లు ‘మిరాయ్’ చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత TG విశ్వప్రసాద్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో పరిశ్రమ వర్గాలు, పవన్ అభిమానులు, సినీ లవర్స్ మిరాయ్ టీమ్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే, ఈ నిర్ణయం ఒక్కరోజు మాత్రమే వర్తించనుంది. శుక్రవారం నుంచి మళ్లీ అన్ని థియేటర్లలో ‘మిరాయ్’ సాధారణ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. ఓజీ సినిమాకి గ్రాండ్ రిలీజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ చర్య ప్రస్తుతం టాలీవుడ్లో హెల్తీ కాంపిటీషన్కి నిదర్శనంగా మారింది. ఇదిలా ఉండగా, ‘మిరాయ్’లో ఇటీవల జోడించిన వైబ్ ఉంది పాటకూ మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో రెండు సినిమాలపైనా ప్రేక్షకుల ఆసక్తి పెరిగి బాక్సాఫీస్ వద్ద హుషారు మరింతగా పెరగనుందని అంచనా వేస్తున్నారు.
