
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సరికొత్త తెలుగు స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న రిలీజ్ అయిన ఈ చిత్రం, కేవలం వీకెండ్ (మొదటి మూడు రోజుల్లోనే) లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.236.7 కోట్ల భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు గంటల సుదీర్ఘ రన్టైమ్, అక్కడక్కడా నెమ్మదించిన కథనం వల్ల సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల జోరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రామ్చరణ్ యాక్టింగ్పై ప్రశంసల జల్లు
డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మల్టీ-స్పోర్ట్స్ అథ్లెట్ ‘పెద్ది’గా అద్భుతమైన యాక్టింగ్తో అదరగొట్టాడు. చరణ్ వన్మెన్ షోపై సామాన్య జనం నుంచి ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. చరణ్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా భారీ విజయంతో దూసుకుపోతున్నప్పటికీ, ఒక చిన్న వివాదం చిత్ర యూనిట్ను చుట్టుముట్టింది. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ను అతిగా గ్లామర్ను చూపించేలా కొన్ని సీన్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు వెంటనే స్పందించారు. ప్రేక్షకుల భావాలను గౌరవిస్తూ ఆయన క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, వివాదాస్పదంగా ఉన్న ఆ సన్నివేశాలను తక్షణమే ఎడిట్ చేసి సినిమాను థియేటర్స్లో ప్రదర్శిస్తామని హామీ కూడా ఇచ్చారు.
రూ.250 కోట్ల మైలురాయి వైపు పరుగులు..
ఈ చిన్న వివాదం – మిక్సిడ్ టాక్ను పక్కన పెడితే, థియేటర్ల వద్ద పెద్ది మెగా మాస్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. విడుదలైన నాలుగో రోజు నాటికే ఈ చిత్రం రూ.250 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేందుకు రెడీగా ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. లాంగ్ రన్లో ఈ సినిమా మరిన్ని వసూళ్ల రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెబుతున్నాయి.
