
Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం హిట్తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్టుపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ను లాక్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. గతంలో త్రివిక్రమ్ రచయితగా “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” సినిమాలకు పని చేసినా, డైరెక్టర్గా వెంకటేష్తో ఇంతవరకు సినిమా చేయలేదు. చివరికి ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అవడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్రిష, నిధి అగర్వాల్ హీరోయిన్లు..?
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే స్టార్ట్ కాగా, ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. సమాచారం ప్రకారం, ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారట. అందులో ఒకరు సీనియర్ హీరోయిన్ త్రిష కాగా, మరో యువ నటి నిధి అగర్వాల్. వెంకటేష్, త్రిష కలయికలో “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే”, “బాడీగార్డ్”, “నమో వెంకటేశ” చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వీరిద్దరి కలయిక మళ్లీ రిపీట్ అవుతోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తుందట. మరి త్రివిక్రమ్ తన మేజిక్ను వెంకీ మీద ఎలా చూపిస్తాడో చూడాలి!
