
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తోటి నటీనటుల కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా నిలిచే ఆయన, ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతున్న నటుడు గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతూ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ఆరోగ్య పరిస్థితిని మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సుబ్బారెడ్డితో తరచూ మాట్లాడుతూ.. రమేష్ చికిత్స పురోగతిపై ఆరా తీస్తున్నారని సమాచారం. అలాగే రమేష్కు అవసరమైన వైద్య సహాయం ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, రమేష్ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా పరామర్శించిన చిరంజీవి, చికిత్స ఖర్చుల విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. మెగాస్టార్ చేసిన ఈ సహాయం పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనను అభినందిస్తున్నారు. అవసరమైన సమయంలో సహచర కళాకారులకు అండగా నిలవడం చిరంజీవి వ్యక్తిత్వానికి నిదర్శనమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
