
సమాజంలో కొనసాగుతున్న అసమానతలు, అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను గట్టిగా ప్రశ్నించేలా రూపొందిన ‘దండోరా’ సినిమా టైటిల్ సాంగ్ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. “నిను మోసినా నను మోసినా అమ్మ పేగు ఒకటేనన్నా…” అంటూ సాగే ఈ పాట హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో పాటు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తోంది. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ఆంథోని దాసన్ మరియు మార్క్ కె రాబిన్ గానం పాటకు మరింత బలాన్ని చేకూర్చింది.
తరాలు మారినా, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా సమాజంలో ఇంకా తగ్గని వివక్ష, దౌర్జన్యాలను ఈ పాట తీవ్రంగా ప్రశ్నిస్తుంది. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టి ఎన్నో ఏళ్లయినా, కుల, వర్గ భేదాలు ఇంకా కొనసాగుతున్నాయన్న భావన ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ‘దండోరా’ టైటిల్ సాంగ్ ఎమోషనల్గా, హార్ట్ టచింగ్గా ఆడియెన్స్ను ఆకట్టుకుంటోంది.
కలర్ ఫోటో, బెదురులంక 2012 వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో సామాజిక స్పృహను కలిగించే అంశాలతో రూపొందుతున్న ‘దండోరా’ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
