
Kothapallilo Okappudu : పల్లెటూరి ప్రేమ, వినోదం, మిస్టరీ సమ్మేళనంగా రూపొందిన కొత్త తెలుగు సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ విడుదలైంది. రానా దగ్గుబాటి సమర్పణలో, ప్రవీణా పరుచూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జూలై 18న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్తో ఆకట్టుకోగా, ఇప్పుడు ట్రైలర్ కూడా ప్రేక్షకులలో మంచి ఉత్కంఠను కలిగిస్తోంది.
ట్రైలర్ లోకి వెళ్తే, గ్రామంలో డాన్స్ స్టూడియో నడుపే రామకృష్ణ, సావిత్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాడు. ఒక రోజు సావిత్రి అతన్ని గడ్డి దుబ్బ వద్ద కలవమని అడుగుతుంది. ప్రేమలో మునిగిపోయిన రామకృష్ణ ఆ రోజు కోసం ఎదురుచూస్తూ అక్కడకు వెళ్తాడు. కానీ అక్కడ జరిగే సంఘటన అతని జీవితాన్ని తారుమారు చేస్తుంది. సాధారణ ప్రేమకథలా అనిపించిన ఈ కథ ఒక్కసారిగా మిస్టరీ మలుపు తీసుకుంటుంది. ఇది కేవలం హాస్యకథ మాత్రమే కాదు ఓ అనూహ్యమైన మానవ అనుబంధాన్ని, భక్తి తత్వాన్ని కూడా టచ్ చేస్తుందని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది.
ఈ కథను గురు కిరణ్ బత్తుల రచించగా, ప్రవీణా పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాక, కీలక పాత్రలో కూడా నటించారు. మనోజ్ చంద్ర, మోనికా టి జంట కథలో నిజాయితీని, కొత్తదనాన్ని తీసుకురాగా, రవీంద్ర విజయ్ అప్పన్న పాత్రలో తనదైన ముద్ర వేస్తాడు. అలాగే పేట్రోస్ అంటోనియాడిస్ అందించిన గ్రామీణ విజువల్స్ ఆకట్టుకుంటాయి. వరుణ్ ఉన్ని నేపథ్య సంగీతం, మణిశర్మ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు సినిమాకు చక్కటి వాతావరణాన్ని సృష్టించాయి.
