
Movie Ticket : సినిమాలు వినోదం కోసం మాత్రమే కాకుండా, కుటుంబంతో కలిసి సమయాన్ని గడిపే ప్రధాన మార్గంగా మారాయి. వారం పొడవునా పని ఒత్తిడిలో మునిగిపోయిన ప్రజలకు, ఓ మంచి సినిమా చూడడం రిలీఫ్లా ఉంటుంది. అయితే ఇటీవల థియేటర్లలో టికెట్ ధరలు గణనీయంగా పెరగడం వల్ల, మధ్యతరగతి ప్రజలకు సినిమాలు అందని కొండలుగా మారుతున్నాయి. ప్రత్యేకించి మల్టీప్లెక్స్లలో టికెట్ల ధరలు ₹500 నుంచి ₹1000 వరకు ఉండటం సాధారణ కుటుంబాలకు భారంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, కర్ణాటక ప్రభుత్వం తాజా ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని థియేటర్లు మరియు మల్టీప్లెక్స్లలో సినిమా టికెట్ ధర పన్నుతో సహా గరిష్టంగా ₹200 మించకూడదని స్పష్టం చేసింది. ప్రజలందరికీ సినిమాలు చేరువ కావాలని, టికెట్ ధరల భారం వల్ల ఎవరూ వెనకడుగు వేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఇది ముసాయిదా నోటిఫికేషన్ కాబట్టి, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో ప్రభుత్వం ఎదుట అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. ఒకవైపు ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షాతిరేకంగా స్వాగతిస్తుంటే, మరోవైపు మల్టీప్లెక్స్ యాజమానులు మాత్రం నష్టాల బెడదలో పడతామంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
