Site icon TeluguMirchi.com

Odela2 Trailer Talk: శివశక్తిగా తమన్నా.. ఆత్మలతో యుద్ధానికి రెడీ!


కరోనా టైంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన “ఓదెల 2” ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి పార్ట్ లో హెబ్బా పటేల్ లీడ్ రోల్ చేయగా ఈసారి కథలో ప్రధాన పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పోషిస్తోంది. డైరెక్టర్ అశోక్ తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకుంది. ఇటీవల ముంబైలో హిందీ ట్రైలర్ విడుదలచెయ్యగా ఈ రోజు తెలుగులో రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలోనే “భరత ఖండమున…” అనే వాయిస్ ఓవర్ ఆకట్టుకోగా, తమన్నా లేడీ అఘోరీగా శివశక్తిగా కనిపించడం విశేషంగా నిలిచింది. ఆమె చెప్పిన “మనము నిలబడాలంటే భూమాత… బతకాలంటే గోమాత…” అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. విజువల్స్, బీజీ స్కోర్, మిస్టిక్ అట్మాస్ఫియర్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

కథ ప్రకారం, తొలి భాగంలో వశిష్ట అనే వ్యక్తిని అతని భార్య హెబ్బా పటేల్ చంపడం, ఆ తర్వాత అతను ఆత్మగా మారి ఊరంతా ప్రతీకారం తీర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో తమన్నా అతని సోదరిగా, శక్తి స్వరూపిణిగా మారి ఊరిని కాపాడేందుకు వస్తుంది. ట్రైలర్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ చేతబడి చేసే వ్యక్తిగా, మురళీ శర్మ ముల్లా సాబ్ పాత్రలో కనిపిస్తారు. హెబ్బా పటేల్ పాత్రను ఫ్లాష్‌బ్యాక్ ద్వారా కలిపి చూపించడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ట్రైలర్ మొత్తాన్ని బట్టి చూస్తే “ఓదెల 2″లో విఎఫ్ఎక్స్, మ్యూజిక్, కథా ప్రస్తావనలన్నీ థియేటర్లో ఆడియెన్స్‌కు రక్తికట్టిన అనుభూతిని కలిగిస్తాయనిపిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version