Site icon TeluguMirchi.com

దానయ్య ఔట్.. ‘పీపుల్ మీడియా’ ఇన్.. ‘OG 2’ లో భారీ ట్విస్ట్!

OG

OG 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన జోష్‌తో మేకర్స్ దీనికి సీక్వెల్ ‘OG 2’ని కూడా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ నిర్మాణానికి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ‘OG’ ఫస్ట్ పార్ట్‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాత డివివి దానయ్య.. పార్ట్-2 నుంచి తప్పుకున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘OG 2’ నిర్మాణ బాధ్యతలను పవన్ కళ్యాణ్ స్వయంగా తన సొంత బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’పై టేకోవర్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కూడా భాగస్వామిగా చేరి, భారీ బడ్జెట్‌తో ఈ సీక్వెల్‌ను సంయుక్తంగా నిర్మించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇటీవల సుజీత్‌తో పవన్ కళ్యాణ్ జరిపిన ‘OG 2’ చర్చల అప్‌డేట్‌ను కూడా ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అధికారిక హ్యాండిల్ నుంచే రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని నిర్మించిన డివివి సినిమాస్ సోషల్ మీడియా ఖాతాల్లో దీనికి సంబంధించిన ఎలాంటి ఊసు లేకపోవడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశలో జపాన్ షెడ్యూల్ విషయంలో బడ్జెట్ పరంగా నిర్మాతకు, దర్శకుడికి మధ్య కొన్ని వ్యత్యాసాలు వచ్చాయని, ఆ సమయంలో సుజీత్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని షూట్ పూర్తి చేశారని ఒక టాక్ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే, సీక్వెల్ ప్రాజెక్ట్‌ను మరింత భారీగా, ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించేందుకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సినిమా షూటింగులను బ్యాలెన్స్ చేస్తూ త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారట. ఏదేమైనా ‘OG 2’ ప్రొడక్షన్ చేతులు మారడం అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో మోస్ట్ వైరల్ టాపిక్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version