
Divorce Case: తమిళ హీరో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2024లో విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ జంటకు సంబంధించిన కేసులో తాజాగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా కథనాల ప్రకారం.. చెన్నై కుటుంబ న్యాయస్థానం ఆర్తి రవి కోరిన నెలకు రూ.40 లక్షల భరణం అభ్యర్థనను అంగీకరించలేదని, విడాకుల కేసు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నెలకు రూ.3 లక్షలు మాత్రమే చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
అలాగే ఈ కేసు నేపథ్యంలో సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంటూ న్యాయపోరాటం సాగించిన రవి మోహన్కు తన ఇద్దరు కుమారులను కలిసే హక్కును కూడా కోర్టు మంజూరు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తన పిల్లలకు దూరంగా ఉండాల్సి రావడం ఎంతో బాధ కలిగించిందని, విమర్శలను కూడా ఎదుర్కొన్నానని రవి మోహన్ భావోద్వేగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే భరణం, పిల్లలను కలిసే విషయంపై కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
