
తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలపై జరుగుతున్న డిజిటల్ మానిప్యులేషన్, ఫేక్ రివ్యూలు, ఆన్లైన్ దుష్ప్రచారానికి చెక్ పెట్టేలా చారిత్రాత్మక నిర్ణయం అమలులోకి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించి టికెటింగ్ ప్లాట్ఫామ్లలో రేటింగ్స్, రివ్యూలను చట్టబద్ధంగా నియంత్రించే చర్యలు చేపట్టారు. దీని వల్ల కావాలని చేసే నెగటివ్ ప్రచారానికి బ్రేక్ పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో సినిమా విడుదలైన నిమిషాల్లోనే బాట్స్, ఫేక్ అకౌంట్ల ద్వారా నెగటివ్ టాక్ను వ్యాప్తి చేయడం పెద్ద సమస్యగా మారింది. భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలను కొందరి స్వార్థపూరిత అజెండాలు ప్రభావితం చేస్తున్నాయనే ఆరోపణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం, ప్రేక్షకులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తుందని టాలీవుడ్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు.. ఈ డిజిటల్ సేఫ్గార్డ్స్ను బ్లాక్బిగ్, ఐప్లెక్స్ సంస్థలు భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ సహకారంతో అమలు చేస్తుండగా, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పూర్తి మద్దతు ప్రకటించాయి. భవిష్యత్తులో ఈ విధానం మరిన్ని సినిమాలకు మార్గదర్శకంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
