
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలపై ఇప్పుడు ఆసక్తికరమైన ట్రేడ్ టాక్ సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దుబాయ్కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిల్మ్స్ అధినేత ఈ ప్రాజెక్ట్కు ఏకంగా రూ.500 కోట్ల వరకు అప్పు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని సుమారు 11 శాతం వడ్డీకి సమకూర్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ భారీ ఒప్పందానికి సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం ఇంకా వెలువడలేదు.
ఇక ఈ డీల్లో భాగంగా ‘వారణాసి’ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా ఈ లోన్ రీపేమెంట్కు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సినిమా హక్కుల విక్రయం ద్వారా వచ్చే మొత్తంతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించేలా డీల్ చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ భారీ డీల్కు సంబంధించి మరో ఆసక్తికరమైన కండిషన్ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. సినిమా స్టార్టింగ్ టైటిల్స్లో ఫార్స్ ఫిల్మ్స్ అధినేత ఫొటోను ప్రదర్శించాలనే షరతు పెట్టినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కావడంతో ‘వారణాసి’పై ఇండియా వైడ్గానే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న రూ.500 కోట్ల డీల్ నిజమే అయితే.. ఇండియన్ సినిమా బిజినెస్లోనే ఇదొక అరుదైన సమీకరణగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
