Yandamuri Veerendranath : ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ -మెగాస్టార్ చిరంజీవి మధ్య అనుబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. ఎప్పుడూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే యండమూరి, కొన్నిసార్లు మెగా అభిమానుల ట్రోలింగ్కూ గురయ్యారు. ఆయన రచించిన అభిలాష, రాక్షసుడు, డబ్బు – ది పవర్ ఆఫ్ మనీ, నల్లంచు తెల్లచీర వంటి నవలలు చిరంజీవి హీరోగా సినిమాలుగా తెరకెక్కాయి. అంతేకాదు, యండమూరి దర్శకత్వం వహించిన సువర్ట్పురం పోలీస్స్టేషన్లో కూడా చిరంజీవి నటించారు. అయితే ఆ చిత్రం కమర్షియల్గా విజయం సాధించలేదు.
చిరంజీవి 70వ జన్మదిన సందర్భంగా, కళారవిందం సంస్థ యండమూరి వీరేంద్రనాథ్కి జీవన సాఫల్య పురస్కారంను అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “చిరంజీవి సినిమాల్లో కథలు, నిర్మాణంలో జోక్యం చేసుకుంటారని అనుకోవడం తప్పు. నేను ఆయనతో 15 సినిమాలకు పనిచేశాను. తన బాధ్యత తప్ప ఆయన మరే విషయంలోనూ జోక్యం చేసుకున్నట్లు చూడలేదు. కేవలం నటుడిగా తన పని పూర్తి చేసి వెళ్లిపోయేవారు. ఆయనపై వచ్చే వార్తలు వాస్తవానికి దూరం” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ఇక కొంతకాలం క్రితం ఓ ఇంజనీరింగ్ కాలేజీ వేడుకలో యండమూరి, రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనమే అయ్యాయి. “చరణ్ని హీరో చేయాలని చిన్నప్పటి నుంచే సురేఖ కరాటే, డ్యాన్స్ నేర్పించింది. ఆయన దవడ సరిగ్గా లేకపోవడంతో ఆపరేషన్ చేసి సవరించారు. మగధీరతో స్టార్ హీరో అయ్యాడు” అని ఆయన చెప్పడంతో అప్పట్లో మెగా అభిమానులు తీవ్రంగా ఆగ్రహించారు. అయినప్పటికీ, చిరంజీవి యండమూరి పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలకు అనేకసార్లు హాజరయ్యారు. తాజాగా యండమూరి, “తాను చిరంజీవి జీవిత చరిత్ర రాస్తున్నాను” అని ప్రకటించారు.
యండమూరి వీరేంద్రనాథ్ 1948 నవంబర్ 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించారు. ఆయన తాత పండితుడు కాగా, తండ్రి ఆర్థిక సమస్యలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అప్పుడు వీరేంద్రనాథ్ కొందరి సాయం తీసుకుని చదువుకున్నారు. ఖర్చులు తగ్గించుకోవడం కోసం అప్పటినుంచే క్షవరం తానే చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆ నియమాన్ని ఈ వయసులో కూడా పాటిస్తుండటం విశేషం.

