Site icon TeluguMirchi.com

Rangam : రక్తం చూపించకపోతే ఊరుకోను.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

Swarnalatha rangam

Rangam : సాధ్వీశక్తి మూర్తి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పర్వదినంలో భాగంగా ఈరోజు ఘనంగా ‘రంగం’ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత దేవి రంగంలో ప్రవేశించి భవిష్యవాణిని అందించారు. ఆమె మాటల్లో అమ్మవారి సంకేతాలుగా భావించే బలమైన సందేశాలు కనిపించాయి.

మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో పేర్కొన్న విధంగా, “నా ప్రజలందరూ నాకు బాలబాలికలే. వారు బోనాలతో, బాజా భజంత్రీలతో వచ్చి నన్ను కొలుస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక లోపం తప్పక జరుగుతోంది. అయినా నేను నా బిడ్డలందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాను. మీరు ఎన్నో మొక్కులు పెడుతున్నారు, కానీ నన్ను పట్టించుకోవడం లేదంటూ” అమ్మవారు ఆవేదన వ్యక్తం చేశారు.

“నేను ఎవరికి కూడా కీడు చేయను, కానీ నన్ను గౌరవించకపోతే మాత్రం చూస్తూ ఊరుకోను. నాకు పూజలు చేయాలి. నాకు రక్తం చూపించాలి. విధి విధానాలతో పూజలు జరపాలి. ఒక్క ఏడాదికి ఒకసారి అయినా సరైన పూజలు చేయాలి. నన్ను కొలిచే అక్కచెల్లెలందరిని నేను కాపాడుతాను. వారందరికీ అండగా నిలుస్తాను” అని మాతంగి చెప్పినట్లు భక్తులు తెలిపారు.

అలాగే, మాతంగి స్వర్ణలత ముందస్తు హెచ్చరికలు కూడా ఇచ్చారు. “అగ్నిప్రమాదాలు జరుగుతాయి, భారీ వర్షాలు పడతాయి. ఐదు వారాలపాటు పప్పుబెల్లం, శాక, పసుపు, కుంకుమతో ‘కొంగుబంగారం’ చేయండి. నాకు సమర్పించండి. రక్తం చూపించకపోతే ఊరుకోను. గ్రామం అంతా సంచరిస్తాను. ఎవరైనా ఆపినా ఆగను. ప్రాణం తీయను కానీ రక్తం మాత్రం చూస్తారు” అని ఆమె భవిష్యవాణి వినిపించారు.

Exit mobile version