కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం ‘బుట్ట బొమ్మ’


ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ తో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమయ్యారు. నేడు(ఫిబ్రవరి 4న) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ.. “మా సినిమాకు ఇంతమంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. సినిమా బాగుందని యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది లవ్ స్టోరీ నుంచి థ్రిల్లర్ గామారే కథ అయినప్పటికీ.. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. మీ కుటుంబంతో కలిసి వెళ్ళండి.. ఈ చిత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రి తన కూతురితో కలిసి చూడాల్సిన సినిమా. మనం పిల్లలతో చెప్పలేని కొన్ని విషయాలను.. ఈ సినిమా చూపించి వారికి సులభంగా అర్థమయ్యేలా చేయొచ్చు. థియేటర్ కి వెళ్లి చూడండి.. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి మీకు కలుగుతుంది. రోజురోజుకి ఈ సినిమా మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము” అన్నారు.

నటుడు అర్జున్ దాస్ మాట్లాడుతూ.. “అందరికీ మా సినిమా నచ్చిందని అనుకుంటున్నాను. ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. సినిమాలో నా నటన, డబ్బింగ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సినిమాకి, సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుండటం ఆనందంగా ఉంది” అన్నారు.

నటుడు సూర్య వశిష్ఠ మాట్లాడుతూ.. “ఈరోజు ఉదయం మేము ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా మీద మేం పెట్టుకున్న నమ్మకం నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూసి, మమ్మల్ని ఆదరించండి” అన్నారు.

నటి అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ.. “మేం ఎంతో ఇష్టపడి చేసిన మా బుట్టబొమ్మ సినిమాకు ఇంతమంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.

రచయిత గణేష్ రావూరి మాట్లాడుతూ.. “బుట్టబొమ్మ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేం ఊహించినట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కథలో ఉన్న మలుపులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం” అన్నారు.