నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సినిమా “అఖండ”. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ..ఈరోజుభారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో అభిమానులు, చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటె చిత్రసీమలో స్టార్స్ సైతం అఖండ విజయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు అఖండ చిత్రం ఓపెనింగ్స్ పై స్పందించారు. అఖండ చిత్రానికి అదిరిపోయే ఆరంభం లభించిందన్న వార్తలతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి, యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మహేశ్ బాబు వ్యాఖ్యల పట్ల చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ బదులిచ్చింది. థాంక్యూ మహేశ్ బాబు గారూ అంటూ స్పందించింది.
ఇక యువ హీరో రామ్ పోతినేని స్పందిస్తూ, ఎక్కడ చూసినా అఖండ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైందంటూ రామ్ హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణ, బోయపాటి, చిత్రయూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. అటు, అఖండ మాస్ జాతర అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యానించారు. యావత్ చిత్ర పరిశ్రమ మొత్తం నేడు అఖండ విజయాన్ని ఆస్వాదిస్తోందని దర్శకురాలు నందినిరెడ్డి తెలిపింది.