26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రం ఇపుడు పొరుగు దేశాల్లో కూడా రికార్డు సృష్టిస్తోంది. గత నెల 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు ఓటీటీలోనూ రికార్డులను సృష్టిస్తోందని సినిమా హీరో అడివి శేష్ ట్వీట్ చేశారు.
నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిషన్లలో మేజర్ కొనసాగుతుంది. ‘మేజర్’ హిందీ వెర్షన్ టాప్ 1లో ట్రెండ్ అవుతుండగా, తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉంది. మనదేశంలోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ఈ మూవీ ఓటీటీలో రికార్డు సృష్టిస్తోంది. పాక్లో నెట్ఫ్లిక్స్లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్ మొదటి స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా ఈ చిత్రం నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం. మహేశ్బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మించాయి.